బోరుకు కొత్త మోటారు..10 నల్లాల ఏర్పాటు
- నీటి సమస్యకు కౌన్సిలర్ బండారు అరుణజ్యోతి చొరవతో పరిష్కారం
వనపర్తి, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):వనపర్తి మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు పాత సీఎంఎస్ గోదాం లైన్ ప్రజలకు నీటి కష్టాలు తొలగనున్నాయి. వార్డు కౌన్సిలర్ బండారు అరుణజ్యోతి చొరవతో నిరుపయోగంగా ఉన్న బోరును తిరిగి వినియోగంలోకి తీసుకురావడంతోపాటు కొత్త మోటారు, పైపులైన్ ఏర్పాటు చేశారు. బోరు నీటిని ప్రజలకు అందించేందుకు పది మంచినీటి నల్లాలను ఏర్పాటు చేయించారు. సోమవారం కౌన్సిలర్ బండారు అరుణజ్యోతి నూతన మోటారు, మంచినీటి నల్లాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
నీటి సమస్యకు పరిష్కారం
పాత సీఎంఎస్ గోదాం రోడ్డు, పాలిటెక్నిక్ కళాశాల దక్షిణ కాంపౌండ్ వైపు ఉన్న నివాస ప్రాంతాల్లో కొంతకాలంగా బోరు నీరు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా నది రామన్ పాడు నుంచి నీటి సరఫరా ఉన్నప్పటికీ అత్యవసర సమయాల్లో బోరు నీరు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను స్థానికులు కౌన్సిలర్ బండారు అరుణజ్యోతి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గతంలో నిరుపయోగంగా ఉన్న బోరును పరిశీలించి, కొత్త మోటారు మున్సిపల్ అధికారులతో మాట్లాడి బిగించారు. అవసరమైన పైపులైన్ ఏర్పాటు చేసి బోరు నీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రోడ్డు వెంట పది మంచినీటి నల్లాలను ఏర్పాటు చేయించారు. రోడ్డు వెంట నల్లాలను ఏర్పాటు చేయడంతో ఆయా నివాస ప్రాంతాల ప్రజలకు నీటి సౌకర్యం కలిగింది. బోరు మోటారును అవసరమైన సమయంలో వినియోగించుకునేలా చర్యలు చేపట్టడంతో ఇక నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన కౌన్సిలర్కు వార్డు మహిళలు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
నీటిని పొదుపుగా వినియోగించాలి
నీరు విలువైన వనరని కౌన్సిలర్ బండారు అరుణజ్యోతి అన్నారు. అవసరమైన సమయంలో మాత్రమే బోరు మోటారును వినియోగించుకోవాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. బోరు, పైపులైన్ నిర్వహణలో ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బి. శ్రీనివాస్గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు గులాం ఖాదర్ఖాన్, మున్సిపల్ వాటర్లైన్ ఇన్స్పెక్టర్ శేఖర్, వాటర్లైన్మెన్లు, వార్డు మహిళలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.