prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 12:54 pm Digital Edition : PRAJA KSHETRAM

భక్తుల కొంగుబంగారం.. శ్రీ అంబురామేశ్వర స్వామి

భక్తుల కొంగుబంగారం.. శ్రీ అంబురామేశ్వర స్వామి

  • శ్రావణమాసం చివరి సోమవారం….. శ్రీఅంబురామేశ్వరునిజాతరకు సర్వం సిద్ధం
  • కర్ణాటక సరిహద్దు ప్రాంతం నుంచి భారీగా తరలిరానున్న భక్తులు
  • జాతర ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ కమిటీ పెద్దలు,సభ్యులు,గ్రామస్తులు
  • త్రేతాయుగం నాటి ఆలయం.. భక్తుల కొంగుబంగారం
  • ఐదు ఆకుల పుండీకూరకు ప్రత్యేక గుర్తింపు
  • జాతరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం
  • పెద్దేముల్ ఎస్‌ఐ ఎం.ప్రశాంత్‌ వర్ధన్‌

పెద్దేముల్, ఆగస్టు 30(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లాలోనే విశేష ప్రాధాన్యత కలిగిన శ్రీ అంబురామేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో కొలువుదీరిన శ్రీ అంబురామేశ్వర స్వామి ఆలయం శ్రావణమాసంలో భక్తులతో కిటకిటలాడనుంది. శ్రావణమాసం చివరి సోమవారం సెప్టెంబర్ 7న స్వామివారి జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ పెద్దలు, సభ్యులు, గ్రామస్తులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

త్రేతాయుగం నాటి ఆలయంగా విశ్వాసం

పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల మధ్య దట్టమైన అడవుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన శ్రీ అంబురామేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉందని స్థానిక భక్తులు, గ్రామస్తులు విశ్వసిస్తారు. త్రేతాయుగంలో ఈ ఆలయం వెలుగులోకి వచ్చిందని,స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దీంతో ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కొంగుబంగారంగా మారింది.

కర్ణాటక నుంచి భారీగా భక్తుల రాక

ప్రతి ఏడాది శ్రావణమాసం చివరి సోమవారం జరిగే జాతరకు తాండూరు, వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, చించోలి, బీదర్, కుంచారం, షాదీపూర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

పల్లకీ సేవతో ప్రారంభం.. ప్రత్యేక పూజలు

జాతర ఉత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 6న ఆదివారం రాత్రి తట్టేపల్లి గ్రామం నుంచి
శ్రీ అంబురామేశ్వర స్వామివారిని పల్లకిలో ఆలయం వరకు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అనంతరం సెప్టెంబర్ 7న సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తుల దర్శనం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారిని తిరిగి తట్టేపల్లి గ్రామానికి తీసుకురావడంతో ప్రధాన జాతర ముగుస్తుంది. మరుసటి రోజు తట్టేపల్లి గ్రామంలో దుకాణ సముదాయాలతో మరో జాతరను నిర్వహించడం కూడా ఆనవాయితీగా వస్తోంది.

ప్రతిరోజూ భక్తులతో సందడే.. నిత్య అన్నదానం

జాతర తేదీ సమీపిస్తున్న కొద్దీ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. నిత్యం పూజలు, భజనలు, అభిషేకాలు, స్వామివారి దర్శనాలతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో కళకళలాడుతున్నాయి.భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన కార్యక్రమం కూడా కొనసాగుతోంది.

ఐదు ఆకుల పుండీకూరకు ప్రత్యేక గుర్తింపు

శ్రీ అంబురామేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సహజసిద్ధంగా లభించే ఐదు ఆకుల పుండీకూర కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ కూరను వంట చేసుకుని తింటే స్వామివారి కృపతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని స్థానిక భక్తుల విశ్వాసం.ఈ కూర విత్తనాలను తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో పెంచేందుకు ప్రయత్నించినప్పటికీ అక్కడ మొలకెత్తలేదని స్థానికులు చెబుతుండటం విశేషం.

గట్టి పోలీసు బందోబస్తు : ఎస్‌ఐ ఎం. ప్రశాంత్ వర్ధన్

జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలయ పరిసరాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తామని పెద్దేముల్ ఎస్‌ఐ ఎం.ప్రశాంత్‌ వర్ధన్‌ తెలిపారు.దట్టమైన అటవీ ప్రాంతంలో జాతర నిర్వహిస్తున్నందున భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆలయ పరిసరాల్లో మద్యం విక్రయాలు, బెల్ట్‌ షాపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమని, ఎవరైనా చట్టవిరుద్ధంగా మద్యం విక్రయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. జాతరను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు, ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు.

భక్తుల రాకతో పండుగ వాతావరణం

శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా జరిగే శ్రీ అంబురామేశ్వర స్వామి జాతరతో తట్టేపల్లి, పాషాపూర్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక సందడితో నిండనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ పెద్దలు,సభ్యులు, గ్రామస్తులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఈసారి జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.