- రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు
- అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవ్
చేవెళ్ల, సెప్టెంబర్ 17(ప్రజాక్షేత్రం):చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు అకస్మాత్తుగా సోదాలు నిర్వహించి సంచలనం సృష్టించారు. బాధితుడి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా సంబంధిత అధికారులను ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. బాధితుని నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఈ దాడులు నిర్వహించి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ట్రెజరీ కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. లంచం డిమాండ్ చేసిన అధికారులపై చట్టపరంగా కేసు నమోదు చేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.