ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రజలే దిక్కు!
- ట్రాఫిక్ రద్దీతో అవస్థలు.. కనిపించని పోలీసులు
శంకర్ పల్లి, సెప్టెంబర్ 03(ప్రజాక్షేత్రం):ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో సామాన్య ప్రజలే ట్రాఫిక్ నియంత్రించాల్సిన పరిస్థితి శంకర్ పల్లి లో నెలకొంది. గురువారం ఉదయం ఇంద్రారెడ్డి చౌరస్తాలో వాహనాల రద్దీ భారీగా పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూడలిలో ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో లేకపోవడంతో కొందరు స్థానికులు ముందుకు వచ్చి వాహనాలను క్రమబద్ధీకరించారు. ఇంద్రారెడ్డి చౌరస్తాలో ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూడళ్ల వద్ద భారీ కెమెరాలు ఏర్పాటు చేసి కార్యాలయాల్లో కూర్చొని వాహనదారులకు జరిమానాలు విధించడంపై ఉన్న శ్రద్ధ.. ట్రాఫిక్ నియంత్రణపై లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చౌరస్తాలో నిరంతరం ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.