prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:19 pm Digital Edition : PRAJA KSHETRAM

భార్య ముక్కు కొరికేసిన భర్త… మంచిర్యాలలో దారుణం

భార్య ముక్కు కొరికేసిన భర్త… మంచిర్యాలలో దారుణం

  • భార్య ముక్కు కొరికేసిన భర్త.
  • మంచిర్యాల జిల్లాలో జరిగిన దారుణ ఘటన.
  • కాపురానికి రావడం లేదన్న కోపంతో భర్త దాడి.
  • అడ్డువచ్చిన మామపై కూడా కర్రతో దాడి.
  • వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి బాధితురాలు తరలింపు.

మంచిర్యాల సెప్టెంబర్ 16(ప్రజాక్షేత్రం):తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఓ కిరాతక ఘటన వెలుగుచూసింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో ఆగ్రహానికి లోనైన భర్తే, భార్య ముక్కు కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ అమానుష ఘటన బుధవారం కొటపల్లి మండలంలో చోటుచేసుకుంది. మణిచందర్, మమత దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా, వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబ కలహాల కారణంగా మమత తన పుట్టింట్లోనే నివసిస్తోంది. ఈ క్రమంలో భార్యను తిరిగి తన వెంట తీసుకెళ్లేందుకు మణిచందర్ నేడు అత్తవారింటికి వెళ్లాడు. అయితే మమతను పంపేందుకు ఆమె తండ్రి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన మణిచందర్ తన మామపై కర్రతో దాడి చేశాడు. భర్తను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మమతపై కూడా అతను విచక్షణారహితంగా దాడి చేసి, ఆమె ముక్కును కొరికేశాడు. ఈ ఘటనలో బాధితురాలి ముక్కు భాగం తీవ్రంగా దెబ్బతింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.