మరకత శివాలయాన్ని దర్శించుకున్న 30 వేల మంది భక్తులు
శంకర్పల్లి జనవరి 26(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి మండలం పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన మహిమగల పురాతన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా, పక్క జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నుండే అభిషేకాలు రద్దుచేసి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి దర్శనానికి, కోరిన కోరికలు తీర్చే రాయి వద్ద కూడా రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 30 వేల మందికి పైగా భక్తులు ఉదయం నుండి రాత్రి వరకు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు. భక్తులందరికీ ఆలయ అర్చకులు సాయిశివ, ప్రమోద్, వీరేష్ లు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరుగురు అన్నదాతలు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. మహాశివరాత్రికి భక్తులు తండోపతండాలుగా శివాలయానికి వస్తారని ఆలయ కమిటీ అంచనా వేస్తున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు సదానందం గౌడ్, అన్నదాన కమిటీ చైర్మన్ దర్శన్ గౌడ్ ఉన్నారు.

