కడిగిన ముత్యంలా కవితక్క వచ్చింది
ప్రజాస్వామ్య దేశంలో న్యాయమే గెలిచింది: ఎండి ముస్తఫా
హైదరాబాద్ ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కవితపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ నమోదు చేసిన అభియోగాలకు సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులపై కూడా ఆరోపణలు రుజువు కాలేదని పేర్కొంది. దాదాపు 166 రోజుల పాటు తీహార్ జైలులో నిర్బంధంలో గడిపిన కవితకు ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చింది. ఈ కేసు రాజకీయ కక్షసాధింపే ఉద్దేశంతో పెట్టినదని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ముస్తఫా మాట్లాడుతూ, “అక్రమ కేసులు పెట్టి తెలంగాణ ఆడబిడ్డను ఇబ్బందులకు గురిచేశారు. కానీ న్యాయస్థానం నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేసింది. ప్రజాస్వామ్యంలో చివరికి న్యాయమే గెలుస్తుంది” అని అన్నారు. అదేవిధంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించిందని విమర్శించారు. భవిష్యత్తులో ప్రజలు తగిన సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు. కవితకు క్లీన్ చీట్ రావడంతో తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

