కీసర ఎంఈఓగా పాటి వెంకటరామ్ రెడ్డి బాధ్యతలు
కీసర, ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండల విద్యా అధికారిగా నూతనంగా నియమితులైన పాటి వెంకటరామ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా సేవలందిస్తున్న ఆయనను డీఎస్ఈ, హైదరాబాద్ ఆర్జేడీ ఉత్తర్వుల మేరకు ఈ పదవిలో నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల హాజరు శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి ఉపాధ్యాయుల సమన్వయం, సహకారం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంలు రవీందర్, రాములు, రామ్రెడ్డి, మైత్రేయి, పుష్పకళతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీధర్, సునీల్, సతీష్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యా రంగ అభివృద్ధికి నూతన ఎంఈఓ నాయకత్వం దోహదం చేస్తుందనే ఆశాభావాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేశారు.

