డబుల్ బెడ్రూమ్ కాలనీలో దోమల భయం
దోమలతో బెంబేలెత్తుతున్న డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రజలు…
కామారెడ్డి జిల్లా ఫిబ్రవరి 26 (ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.దోమల స్వైర విహారం ఎక్కువైందని దోమల బెడద పోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.రాత్రి అయితే చాలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఆపై వీధివీధిలోనూ దోమలు రయ్ రయ్ మంటూ స్వైర్య విహారం చేస్తూ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి.జనం నానా అవస్థలు పడుతున్నా,అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.దోమ కాట్లతో కాళ్లు,చేతులు మండిపోతున్నాయిని వాపోతున్నారు. కాలనిల్లోని డ్రైనేజీ కాలువల్లో నీరు నిల్వ ఉండి, దోమలు స్వైరవిహారం చేయడంతో, వైరల్ జ్వరాలు వెంటాడుతున్నాయి. పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో దోమల భయానికి సాయంత్రం 6 గంటలకే తలుపులు వేసేసుకుంటున్నారు. ప్రజలు వారి నివాసాల్లో దోమల నియంత్రణ మందులు ఎన్ని వాడుతున్నా, ఫలితాలు కనిపించడం లేదని కాలనీ ప్రజలు వాపోతున్నారు. దోమల నివారణపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రైనేజీ మురుగునీరు పారుదల ముందుకు సాగే విధంగా లేకపోవడంతో, దోమలు వాటిని ఆవాసంగా చేసుకొని, ప్రజలు రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో దోమలు విజృంభిస్తుండడంతో డ్రైనేజీల వద్ద పిచికారీ, ఫాగింగ్ చేసి, దోమలను అరికట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డబుల్ బెడ్ రూమ్ కాలనీ ప్రజలు కోరుతున్నారు.

