నాగారం గిరిజన బాలికల వసతి గృహంలో సౌకర్యాల కొరత…
- బాలికల సేఫ్టీపై తక్షణ చర్యలు కోరిన విద్యార్థినులు
- భోజనశాల గది నిర్మాణానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి. నాగారం, ఫిబ్రవరి 28(ప్రజాక్షేత్రం):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలో మౌలిక సదుపాయాల కొరత విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వసతి గృహంలో ప్రత్యేక భోజనశాల లేకపోవడంతో బాలికలు ఆరు బయటే భోజనం చేయాల్సి వస్తోంది. వర్షాకాలం, ఎండాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే భోజనశాల గది నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే వసతి గృహం బయట ఉన్న ప్రహరీ గోడ ఎత్తు తక్కువగా ఉండటంతో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశముందని వారు పేర్కొన్నారు. అందరూ బాలికలే ఉన్న నేపథ్యంలో సేఫ్టీ దృష్ట్యా ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భోజనశాల నిర్మాణంతో పాటు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని విద్యార్థినులు ఆశిస్తున్నారు.

