పెద్దపల్లిలో ఏసీబీ దాడి: లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ రెడ్హ్యాండెడ్గా పట్టుబాటు
పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం వ్యవహారం వెలుగుచూసింది. మంథనిలో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న కాసర్ల రాజేందర్ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఫిర్యాదుదారుడి వద్ద నుంచి రూ.16,500 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫైల్ను ముందుకు పంపేందుకు, ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ అయిన రషీద్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రంగంలోకి దిగారు. ముందస్తు సమాచారంతో పన్నాగం రచించిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కార్యాలయంలో దాడి చేసి, లంచం తీసుకుంటున్న సమయంలోనే రాజేందర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం కార్యాలయ రికార్డులను పరిశీలించి, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ వంటి సాధారణ ప్రజా సేవలకు కూడా లంచాలు డిమాండ్ చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

