అనుమతి ఒకలా… నిర్మాణం మరోలా – నాచారం సర్కిల్లో అక్రమ భవనాల దూకుడు
- సెట్బ్యాక్, పార్కింగ్ లెక్కచేయని నిర్మాణాలు
- మల్లాపూర్ డివిజన్లో చోద్యం చూస్తున్న అధికారులు
నాచారం, మార్చి 11(ప్రజాక్షేత్రం):నాచారం సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్లో బ్యాంక్ కాలనీ, సూర్యనగర్ కాలనీలలో అనుమతి నిబంధనలు ఉల్లంఘిస్తూ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి భవన నిర్మాణాలకు తీసుకున్న పర్మిషన్లు ఒక విధంగా ఉండగా, స్థలంలో నిర్మాణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. భవన నిర్మాణాలకు తప్పనిసరిగా ఉండాల్సిన సెట్బ్యాక్లు, పార్కింగ్ సౌకర్యాలు వంటి నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ వాసులు తెలిపారు. కొంతమంది భవన యజమానులు రోడ్డు వరకు నిర్మాణాలు చేపట్టి, వాహనాల పార్కింగ్కు కూడా ఎలాంటి స్థలం వదలకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలనీల్లో రహదారులు ఇరుకుగా మారి వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. అదేవిధంగా భవనాలకు మంజూరు చేసిన అంతస్తుల కంటే ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ మున్సిపల్ డీసీ, ఏసీపీ, చైన్మ్యాన్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఈ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలను నిలిపివేసి, నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

