కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 20 ఏళ్ల జైలు
వనపర్తి జిల్లా మార్చి 11(ప్రజాక్షేత్రం):కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నేరం రుజువై నందుకు నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత తీర్పు ఇచ్చారని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పానగల్ మండలానికి చెందిన వల్లెపోలు కురుమయ్య తన సొంత కూతురుకు బుక్కులు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి, పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాపురం గ్రామ సమీపంలో జూరాల కాల్వ దగ్గర తేది 03-05-2025 న మధ్యాహ్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి తెలియజేయగా, తల్లి తేది 07-05-2025 న పెబ్బేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి కేసు నమోదు చేయగా, కొత్తకోట సీఐ రాంబాబు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సేకరించడం, బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయడం అవసరమైన చట్టపరమైన చర్యలు పూర్తి చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తరువాత కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఆదేశాల మేరకు సీఐ రాంబాబు, ఎస్సై యుగంధర్ రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారి హెడ్ కానిస్టేబుల్ సత్యం, కోర్టు కానిస్టేబుల్ సంజీవయ్య సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసచారి వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత నిందితుడిపై నేరం నిరూపితమైందని నిర్ధారించి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు డ్యూటీ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

