జీవన్ రెడ్డి దృఢ నిర్ణయం బుజ్జగింపులు ఫెయిల్
జగిత్యాల జిల్లా మార్చి 24(ప్రజాక్షేత్రం):జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో భారీ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఒప్పించేందుకు చివరి ప్రయత్నంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కలిసి మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి కీలకంగా చర్చలు జరిపారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని విడవవద్దని ఆయనకు పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేస్తూ నాయకులు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి 43 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకుడని తాను 1986 నుంచే ఆయనతో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉన్నానని తెలిపారు. ఇంత అనుభవం ఉన్న నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో కొంత ఇబ్బందులకు గురవడం సహజమని, రాజకీయంగా కొన్ని నిర్ణయాల వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయని అన్నారు. ఇటీవల ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా పలువురు నేతలు కూడా జీవన్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారని గుర్తు చేశారు. ఏఐసీసీ నాయకత్వం కూడా జీవన్ రెడ్డిని పార్టీలో కొనసాగాలని కోరుతోందని ఆయనలాంటి నాయకుడిని పార్టీ వదులుకోదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి రాజీనామా చేయరు అన్న అశతోనే తాను వెలుతున్నానని అయన తెలిపారు. అయితే ఈ బుజ్జగింపులన్నింటినీ జీవన్ రెడ్డి తోసిపుచ్చినట్లు సమాచారం. తనకు కాంగ్రెస్ పార్టీలో వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో పార్టీని వీడటం తప్ప మార్గం లేదని ఆయన స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయంపై తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని సమావేశంలోనే ఆయన కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ఇక బుధవారం జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జీవన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 వేల మంది కార్యకర్తలతో ఈ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సభ వేదికపైనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ వేదికల ద్వారా తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయాలను జీవన్ రెడ్డి బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ నిర్ణయానికి దగ్గరయ్యారని స్పష్టమవుతోంది. మొత్తానికి కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన చివరి ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద ట్విస్ట్కు వేదిక సిద్ధమవుతోంది.

