తక్కువ త్యాగాలు, ఎక్కువ ఫలితాలు, ఎమ్మార్పీఎస్ చరిత్ర
– విప్లవోద్యమ స్ఫూర్తి – పులే, అంబేద్కర్ జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ ల మార్గంలో ఉద్యమ ప్రయాణం.
– పీడితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ విముక్తి కోసం ఇకపై పోరాటం.
– మాదిగ అమరుల స్ఫూర్తి వర్గీకరణ విజయానికి కారణం.
– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ.
హైదరాబాద్ మార్చి 01(ప్రజాక్షేత్రం):దేశంలో అనేక సమస్యల మీద ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల్లో ఎక్కువ ప్రాణ త్యాగాలు జరిగాయని కానీ ఆ త్యాగాలకు తగినంత ఫలాలు ప్రజలకు అందలేదని, అది స్వాతంత్ర ఉద్యమం మరియు తెలంగాణ ఉద్యమం స్పష్టంగా రుజువు చేస్తుందని కానీ మూడు దశాబ్దాల ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ప్రాణ త్యాగాల సంఖ్య స్వల్పంగా ఉందని ఫలితాలు మాత్రం విశాలంగా ప్రజలకు అందుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల సంస్మరణ రోజున పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాదిగ అమరవీరులకు చిత్రపటానికి పూలమాలలు వేసి, దీపాలు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ ఆధ్వర్యంలో అధ్యక్షతన నిర్వహించిన సభలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అనేక ప్రాణ త్యాగాలు జరిగాయని కానీ స్వాతంత్ర్య ఫలాలు మాత్రం దేశంలోని కోట్లాదిమంది ప్రజలకు నేటికీ అందలేదన్నారు. ఆ సమయంలోనే అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలలో ప్రాణ త్యాగాలు స్వల్పంగా ఉన్నాయని కానీ ఫలితాలు మాత్రం పెద్ద ఎత్తున దళితులు పీడితులకు అందాయని అన్నారు. అలాగే తెలంగాణ పోరాటంలో మొదటి దశలోనూ, మలిదశలోను వేలాదిమంది ప్రాణాలు త్యాగాలు చేశారని కానీ ఆ ఫలితాలు తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన అట్టడుగు వర్గాల ప్రజలకు అందలేదని అన్నారు. కానీ ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రయాణంలో ప్రాణ త్యాగాలు స్వల్పంగా జరిగాయని, ఆ ఫలాలు మాత్రం విశాలంగా మాదిగ ప్రజలకు మరియు సమాజానికి అందాయని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుండడం వల్ల విద్యా ఉద్యోగ రంగాల్లో మాదిగలు గణనీయమైన ఫలితాలు పొందుతున్నారని అన్నారు. అలాగే ఎమ్మార్పీఎస్ సాధించిన పథకాల వలన ఆరోగ్యశ్రీ పథకం, వికలాంగుల పెన్షన్లు, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్లు మరియు తెల్లరేషన్ కార్డు మీద పెరిగిన బియ్యం మొదలగు ఫలాలు అత్యంత వెనుకబడిన డక్కలి వాళ్ళ నుండి మొదలుకొని ఉన్నత స్థానం అని చెప్పబడుతున్న బ్రాహ్మణుల వరకు పొందుతున్నారని అన్నారు. అందువల్ల దేశంలో స్వల్ప ప్రాణాలతో విస్తృతమైన, విశాలమైన ఫలాలను ప్రజలకు అందించిన ఏకైక చరిత్ర ఒక ఎమ్మార్పీఎస్ ఉద్యమానికే ఉందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం లక్ష్యం చేరడానికి మాదిగ అమరులు అందించిన స్ఫూర్తి టార్చ్ లైట్ లా (దీపంలా) నిలిచిందని అన్నారు. త్యాగాల్లోకెల్లా ప్రాణ త్యాగాలు అమూల్యమైనవని, ఆ ప్రాణ త్యాగాలు చేసిన మాదిగ అమరవీరులే ఎస్సీ వర్గీకరణ విజయానికి ప్రధాన కారకులని అన్నారు. స్వాతంత్ర ఫలాలు అందకపోవడం వల్ల మరియు రాజ్యాంగఫలాలు క్రింది స్థాయికి చేరకపోవడం వల్ల సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలు అలాగే కొనసాగుతున్నాయని, సాంఘిక వివక్షత ఇప్పటికి అలాగే ఉందని వాటన్నిటినీ పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. పేదరిక నిర్మూలన, సాంఘిక సమానత్వమే ఆశయంగా పోరాటం చేసిన విప్లవోద్యమం ఉద్యమం చతికిలపడే పరిస్థితి వచ్చిందని, సాయుధ పోరాట పంథాను ఎంచుకున్న విప్లవోద్యమం లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని అన్నారు. లక్ష్యం ఉన్నతమైనదైనప్పటికీ ఎంచుకున్న మార్గంలో విజయం సాధించలేకపోయారని అన్నారు. అది వారి మాటల్లోనే స్పష్టం అవుతుందని అన్నారు. భవిష్యత్ లో సాయుధ పోరాట పంథాకు ప్రజల నుండి స్పందన ఉండదని నిరూపితం అవుతుందని అన్నారు. అందువల్ల విప్లవోద్యమ ఆశయమైన సామాజిక సమానత్వం, పేదరిక నిర్మూలన, సామాజిక, ఆర్థిక, రాజకీయ విముక్తి కోసం పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ మార్గంలో రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుందని అన్నారు. మాదిగ అమరుల లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నామని వారి ఆశయ సాధనల వైపు ముందుకెళ్లాలని మాదిగ జాతి ఉన్నంతకాలం మాదిగ అమరులను గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు సోమ శేఖర్ మాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహారావు మాదిగ, పల్లెల సుధాకర్ మాదిగ, శేఖర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.


