📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణప్రభుత్వ వైఫల్యాలపై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం కి ఘాటు లేఖ.

ప్రభుత్వ వైఫల్యాలపై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం కి ఘాటు లేఖ.

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి కి ఘాటు లేఖ.

-రైతు భరోసా నుంచి సాగునీటి వరకు… పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీత.

వనపర్తి, మార్చి 15(ప్రజాక్షేత్రం):రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం తన స్వగృహంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడిన ఆయన, ముందుగా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రశ్నిస్తే అధికారులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని నిరంజన్ రెడ్డి అన్నారు. అధికారులు ప్రజల పక్షాన నిలబడాల్సిందిపోయి రాజకీయ నాయకుల కొమ్ముకాయడం తగదని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు కాకపోతే ప్రజలు తిరగబడటం వారి హక్కు అని స్పష్టం చేశారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతు భరోసా అమలుకు రూ.9 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పి మూడు సీజన్లు గడిచినా అమలు చేయలేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సీఎం ప్రకటనలు హాస్యాస్పదంగా మారాయని, రైతులు రైతు భరోసాపై ఆశలు వదులుకున్నారని అన్నారు. సకాలంలో కరెంట్‌, యూరియా సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించిన వారిపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసు రెండున్నర సంవత్సరాలు గడిచినా తేల్చకపోవడం ప్రభుత్వ వైఫల్యమని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కేసులో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో కేసును ఛేదించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
మున్సిపల్ పాలన పూర్తిగా విఫలమైందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. పట్టణ పరిసరాలు చెత్తతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని, రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేయలేకపోతున్నారని అన్నారు. అన్ని వసతులతో నిర్మించిన టౌన్ హాల్‌ను ఇప్పటివరకు ప్రారంభించకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శనమని చెప్పారు. రోడ్ల విస్తరణ చేపట్టిన ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. రామన్నగట్టు రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ముందుకు సాగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని అన్నారు. డి -5, డి -8 కాలువలను ఆధునీకరించడం ద్వారా సాగునీటి సామర్థ్యం పెంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. ఇరిగేషన్ చీఫ్ అందుబాటులో లేకపోవడంతో సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. గతంలో 7 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎదుల రిజర్వాయర్‌ను రెండేళ్లలో పూర్తి చేశామని, కానీ 2 టీఎంసీల సామర్థ్యం ఉన్న రామన్నగట్టు రిజర్వాయర్‌ను ఇప్పటి మంత్రులు పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణాన్ని నిలిపివేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్కూల్ నిర్మాణానికి తము వ్యతిరేకం కాదని, అయితే మెడికల్ కాలేజీ ఆవరణలో కాకుండా వేరే చోట స్థలం కేటాయించి నిర్మించాలని సూచించారు. భవిష్యత్ తరాల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెడికల్ కాలేజీకి విశాల స్థలం కేటాయించినట్లు గుర్తుచేశారు.
రాజపేట నుంచి పానగల్ రోడ్డును కలుపుతూ సుమారు 9 కిలోమీటర్ల బైపాస్ రోడ్డుకు గతంలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం అవి నిలిచిపోయాయని ఆయన విమర్శించారు. ఈ బైపాస్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. పెబ్బేర్ సంత స్థల వివాదాన్ని రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. న్యాయస్థానాలు పలుమార్లు ప్రైవేట్ యజమానులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. యజమానులకు హక్కుల్లేవని ప్రచారం చేసిన వారు ఇప్పుడు వారికి రింగ్ రోడ్డువద్ద ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పత్రిక సమావేశంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, లక్ష్మారెడ్డి, ఎద్దుల కరుణశ్రీ, కృష్ణా నాయక్, రఘుపతి రెడ్డి, భీమన్న, కర్రెస్వామి, తిరుపతయ్య, మాణిక్యం, పెద్దింటి వెంకటేష్, దిలీప్ రెడ్డి, శివరామ్ రెడ్డి, గౌడ్ నాయక్, రాజశేఖర్, సూర్యవంశం గిరి, చంద్రశేఖర్, చిట్యాల రాము, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular