ప్రజాక్షేత్రం ప్రభావం… రోడ్డును ఆక్రమించిన నిర్మాణాలు తొలగింపు
– రోడ్డుపై బాత్రూమ్, మెట్లు నిర్మాణం… కథనం తరువాత కూల్చివేత
శంకర్ పల్లి, మార్చి 11(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో రహదారిని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. సోమవారం ప్రజాక్షేత్రంలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.
కాలనీలో సుమారు 60 అడుగుల రహదారిని ఆక్రమించి బాత్రూమ్, మెట్లు నిర్మించడం వల్ల రహదారి ఇరుకుగా మారి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు గతంలో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఒక ఇంటి యజమాని నడిరోడ్డుపై నిర్మించిన బాత్రూమ్ కారణంగా దుర్వాసన వస్తోందని, రాకపోకలకు ఆటంకం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును డ్రిల్లింగ్ యంత్రాలతో తవ్వి నీటి కనెక్షన్లు ఏర్పాటు చేయడంతో రహదారి ధ్వంసమైందని కూడా స్థానికులు ఆరోపించారు. ఈ విషయాలను పత్రికలో కథనంగా వెలువడటంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమై అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన బాత్రూమ్, మెట్లు తదితర నిర్మాణాలను తొలగించడంతో కాలనీవాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఆక్రమణలు జరగకుండా మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

