చేవెళ్లలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
- 38 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య.
చేవెళ్ల జూన్ 01(ప్రజాక్షేత్రం):ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల మండలం మరియు మున్సిపాలిటీ పరిధికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ, ఈ రోజు చేవెళ్ల మండలం మరియు మున్సిపాలిటీకి చెందిన 38 మంది లబ్ధిదారులకు రూ.38,00,618 విలువ గల కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

