బంజారాల అభ్యున్నతికి సేవలాల్ మార్గదర్శి:మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
వనపర్తి, ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):బంజారాల అభ్యున్నతికి సేవాలాల్ మార్గదర్శి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహరాజ్ 287వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, సంత్ సేవలాల్ మహరాజ్ బంజారా జాతిని సామాజిక రుగ్మతల నుంచి చైతన్యపరిచి అహింస మార్గంలో నడిపించిన మహనీయుడని అన్నారు. బంజారాలకు స్థిర నివాసాలు కల్పించి, వారి సంస్కృతి–సంప్రదాయాలను పరిరక్షించిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. బంజారా సోదరుల అభివృద్ధికి ప్రత్యేక స్థలం కేటాయించి భవనం నిర్మించామని, భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

