📄 ePaper
Wednesday, February 25, 2026
ads
📄 ePaper
Homeరాజకీయంబాన్సువాడ లో జోరుగా ప్రచారాలు చేస్తున్న పలు పార్టీ నాయకులు

బాన్సువాడ లో జోరుగా ప్రచారాలు చేస్తున్న పలు పార్టీ నాయకులు

📰 Generate e-Paper Clip

బాన్సువాడ లో జోరుగా ప్రచారాలు చేస్తున్న పలు పార్టీ నాయకులు

  • నెగ్గిదెవరు గెలిచేది ఎవరు
  • అవ్వ అమ్మ తాత అంటూ ఆకట్టుకునే యత్నం
  • ఎన్నికల పోరు… ప్రచార జోరు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05(ప్రజాక్షేత్రం):బాన్సువాడ పట్టణంలో పురపాలక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. బాన్సువాడ మున్సిపాలిటీలో బుధవారం నుంచి ప్రధాన పార్టీలన్నీ ప్రచార రంగంలోకి దిగడంతో వార్డులన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

రంగంలోకి ముఖ్యనేతలు…

ప్రచార రథాలు,బైకులు,ఆటోలు, పార్టీ బ్యానర్లు.. ఇలా ప్రతి వీధిలోనూ నినాదాల ప్రతిధ్వని వినిపిస్తోంది.కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన నేతలతో పాటు,సీనియర్ క్యాడర్,డివిజన్ స్థాయి నాయకులు కూడా బూత్ల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డుల వారీగా క్యాడర్ అభ్యర్థుల వెంట అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థులూ ప్రధాన పార్టీలకు సమానంగా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. వారికి వచ్చిన ఎన్నికల గుర్తులను చూపిస్తూ తమ గుర్తుకు ఓటేయండి..అభివృద్ధి కోసం మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగే స్వతంత్రులు ఓటర్లలో ఆప్యాయతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అవ్వా.. అమ్మా.. అంటూ…

ప్రచారంలో అభ్యర్థుల మాటతీరు కూడా ఓటర్లలో చర్చనీయాంశమైంది. అమ్మా.. అవ్వా.. తాత.. ఎలా ఉన్నారు.నేను ఫలానా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈసారి తప్పకుండా నాకు అశీర్వాదం ఇవ్వండి.మీరు పలికిన వెంటనే ముంగిట ప్రత్యక్షమవుతా.. ఐదు సంవత్సరాలు మీ పక్కనే ఉంటా.. అభివృద్ధి చేస్తా అంటూ భరోసా కల్పిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.

ఇంటింటికీ తిరుగుతూ..

అభ్యర్థులకు గుర్తులు ఖరారు కావడంతో వారంతా వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్ల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వాటిని నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు. దీంతోపాటు పలు వీధుల్లో ఉన్న వారిలో యువజన సంఘాలు, కులసంఘాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి వారి మద్దతును కూడగట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇక ప్రచారానికి సంబంధించి పలు వాహనాలు అభ్యర్థులు ఏర్పాటు చేయించుకున్నారు. ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకుని వాటిని వీధుల్లో రోజంతా తిప్పుతూ తమకు ఓటెయ్యమని కోరుతున్నారు. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఇంటికి కనీసం రెండు లేదా మూడు సార్లు వెళ్లి కలిసే విధంగా ప్రణాళిక వేసుకుంటున్నారు.

వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ…

వార్డుల వారీగా క్యాడర్ ఇంటింటికీ తిరుగుతుండగా, పలు సమయాల్లో అభ్యర్థులు మాత్రం ముఖ్యమైన ఓటర్ల ఇళ్లకు వ్యక్తిగతంగా వెళ్లి మద్దతు ఇచ్చి గెలిపించాలని విన్నవిస్తున్నారు. మరోవైపు పార్టీ లీడర్ల అలకలను, గ్రూపుల మధ్య చిన్న చిన్న విబేధాలను బుజ్జగించేందుకు అభ్యర్థులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అలకలు పోవడం, వర్గాలు కలవడం, అభ్యర్థితో కలిసి ప్రచారంలోకి రావడం ఇవన్నీ ప్రచారంలో భాగమయ్యాయి.

తదుపరి రోజుకు నేటి రాత్రే ప్రణాళిక…

ప్రధాన వీధులు, మార్కెట్, పాలు ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. హోటళ్లలో కూర్చున్న వారితో చేతులు కలుపుతూ దుకాణాలను సందర్శిస్తూ, మహిళలను పలకరిస్తూ ప్రతి ఓటరును ప్రేమ, ఆప్యాయతతో తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు బిజీబిజీగా గడుపుతున్నారు. పొద్దంతా ప్రచారం చేసిన పార్టీల క్యాడర్ రాత్రికి తిరిగి పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు, తదుపరి రోజు వ్యూహరచన…ప్రచారం మరింత వేగం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజల్లో అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నప్పటికీ ఎవరి ప్రచారం ఎంత ప్రభావం చూపుతుందన్నది పోలింగ్ రోజునే తేలనుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular