ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో సజీవ దహనం
13 మంది మృతి.. మరణాల సంఖ్య పెరిగే అవకాశం
మార్కాపురం, మార్చి 26(ప్రజాక్షేత్రం):మార్కాపురం జిల్లా సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని క్వారీ వద్ద హరికృష్ణ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో భయానక పరిస్థితి నెలకొంది. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు బయటికి రాలేక సజీవ దహనమయ్యారు. ఇప్పటివరకు 13 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 20 మందికిపైగా గాయపడగా, సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. జగిత్యాల నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న సమయంలో డీజిల్ ట్యాంక్ పగలడంతో మంటలు వేగంగా వ్యాపించాయని ప్రాథమిక సమాచారం. మృతులు సీఎస్ పురం, కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందినవారిగా గుర్తిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

