బూర్గంపాడు మండలంలో ఇసుక మాఫియా అడ్డగోలుగా వ్యవహారం – రైతుల్లో తీవ్ర ఆందోళన
బూర్గంపాడు మార్చి 23(ప్రజాక్షేత్రం):బూర్గంపాడు మండల కేంద్రంలో ఇసుక మాఫియా అక్రమ కార్యకలాపాలు రోజురోజుకూ విస్తరిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, వారి మాటలను పట్టించుకోకుండా జేసిబి యంత్రాలతో భారీ గుంతలు తవ్వుతూ ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు.ఈ అక్రమ తవ్వకాల వల్ల వ్యవసాయ భూములు నాశనమవుతున్నాయని, ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో కిన్నెరసాని వరదలతో ఈ గుంతలు మరింత ప్రమాదకరంగా మారి పొలాలు పూర్తిగా కోతకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. ఇసుక మాఫియా రోజుకు వందలాది లారీల ద్వారా ఇసుకను డంపింగ్ చేస్తూ తరలిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.జిల్లా కొత్త కలెక్టర్ మరియు ఎస్పీ వెంటనే స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ భూములను కాపాడాలని, తమ జీవనాధారాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

