📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవిట్ట శ్రీనివాస్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు…

విట్ట శ్రీనివాస్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు…

📰 Generate e-Paper Clip

విట్ట శ్రీనివాస్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు…


– అమ్మపల్లిలో అంతిమయాత్రకు అశేష జనవాహిని

– మాజీమంత్రి నిరంజన్ రెడ్డి భావోద్వేగం.
వనపర్తి, మార్చి 14(ప్రజాక్షేత్రం):ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న స్థానిక నాయకుడు విట్ట శ్రీనివాస్ రెడ్డి మరణం గ్రామాన్ని మాత్రమే కాదు, మొత్తం ప్రాంతాన్నే శోకసంద్రంలో ముంచింది. శనివారం జరిగిన ఆయన అంతిమయాత్రలో అమ్మపల్లి గ్రామం మొత్తం దుఃఖంతో నిండిపోయింది. తమకు ఎంతో ఆప్తుడైన నాయకుడికి చివరి వీడ్కోలు పలకడానికి గ్రామం నలుమూలల నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి, వనపర్తి జిల్లా నలుమూలల నుంచి అశేష జనవాహిని తరలివచ్చింది. ప్రజల మధ్యే జీవించి, వారి సమస్యలకోసం ఎప్పుడూ ముందుండి పోరాడిన నాయకుడిగా శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. గ్రామాభివృద్ధి, పేదల సంక్షేమం, సామాజిక కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. “మా మధ్యలో ఎప్పుడూ నవ్వుతూ తిరిగే మనిషి ఇక లేడనే నిజం నమ్మలేకపోతున్నాం” అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతుండగా గొంతు దిగబడి, కళ్లలో కన్నీళ్లు ఆగలేదు.“శ్రీనివాస్ రెడ్డి లాంటి నిజాయితీ గల, ప్రజల కోసం జీవించిన నాయకుడు అరుదు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా మాత్రమే కాదు, ప్రజలకు, పార్టీకి తీరని లోటు. ఎప్పుడూ ప్రజల కోసం పరుగులు తీసే మంచి మనసున్న మనిషిని కోల్పోయాం,” అంటూ భావోద్వేగంతో పేర్కొన్నారు. ఆయన మాటలు వినగానే అక్కడి ప్రజలు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం నిరంజన్ రెడ్డి స్వయంగా పాడె మోసి కడసారి వీడ్కోలు పలకడం అక్కడి వారిని మరింత కదిలించింది. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ ప్రియ నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. గ్రామంలో ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మెలిగి, ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా ఆయనను గుర్తుచేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి, గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, రఘుపతి రెడ్డి, రాజమహేంద్ర రెడ్డి, వేణు యాదవ్, బాలేశ్వర్ రెడ్డి, కుమార్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సేనాపతి, పురుషోత్తం రెడ్డి, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు. అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు “శ్రీనివాస్ రెడ్డి అమరుడు” అంటూ నినాదాలు చేస్తూ, కన్నీటి పర్యంతంగా ఆయనకు చివరి వీడ్కోలు పలికారు. ఆయన సేవలు, ఆయన స్మృతులు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పలువురు భావోద్వేగంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular