ఖాళీ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు
కాప్రా, ఏప్రిల్ 07(ప్రజాక్షేత్రం):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం ఘటన కలకలం రేపింది. సైపురి కాలనీకి చెందిన కుమార్ ధర్మరాజన్ కుటుంబంతో కలిసి మార్చి 31న కేరళకు వెళ్లి, ఏప్రిల్ 5 అర్ధరాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ప్రధాన తలుపు తాళం విరగబడి ఉండటాన్ని గమనించిన వారు లోపలికి వెళ్లి చూడగా, గ్రౌండ్ ఫ్లోర్లోని మూడు అల్మరాలు, ఫస్ట్ ఫ్లోర్లోని ఒక అల్మరా పగులగొట్టబడి కనిపించాయి. వాటిలో ఉన్న సుమారు 15 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు కనిపించకుండా పోయాయి. తెలియని వ్యక్తులు తాళం విరగబెట్టి ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసినట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. పిల్లలు ఉదయం ఇంటికి వచ్చిన తర్వాత వారితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లడంతో ఫిర్యాదు ఆలస్యంగా నమోదైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

