మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో దళరుల దందా బహిరంగం
– ఆన్లైన్ వ్యవస్థ ఉండగానే ఆఫ్లైన్ జోక్యం ఎందుకు పెరిగింది?
– ప్రతి సేవకు“అనధికార రేట్లు”అన్న ప్రచారం నిజమేనా ?
– లైన్లో నిల్చుంటే లేట్.. దళరీతో లింక్ ఉంటే స్ట్రైట్?
– ప్రభుత్వ సేవలు మధ్యవర్తుల చేతుల్లోకి?
– వాహనదారులు నేరుగా వెళ్తే పనులు కావు…దళారీ వ్యవస్థతో వెళితే హై స్పీడ్ లో పనులు
– మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు దృష్టి సారించాలి
కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 30(ప్రజాక్షేత్రం):పెట్ బషీరాబాద్ పారదర్శకత, అవినీతి నిర్మూలన పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ సేవలు మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో పూర్తిగా భిన్నంగా అమలవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సౌకర్యంగా ఉండాల్సిన డిజిటల్ సేవలు ఇక్కడ కేవలం బోర్డులకే పరిమితమై, అసలు వ్యవహారం మొత్తం దళారుల ఆధీనంలో నడుస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పేట్ బషీరాబాద్ పరిధిలోని మేడ్చల్ ఆర్టీవో కార్యాలయానికి రోజూ వందలాది మంది వాహనదారులు తమ పనుల కోసం వస్తున్నారు. అయితే కార్యాలయానికి నేరుగా వెళ్లినవారికి పనులు సకాలంలో జరగకపోవడం, ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్లో ఉండిపోవడం, ఒక డెస్క్ నుంచి మరొక డెస్క్కు తిరగాల్సి రావడం వంటి ఇబ్బందులు సాధారణమైపోయాయని బాధితులు చెబుతున్నారు.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్….రేటు మాత్రం పిక్స్
ఇదే సమయంలో కార్యాలయం బయట, లోపల తిరుగుతున్న దళారులు మాత్రం “ ఏం పని… ఎప్పుడు కావాలి , కార్డు డైరెక్ట్ కావాలా? పోస్ట్ లో కావాలా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్… మా రేట్లు ఫిక్స్ ” అంటూ ముందే రేట్లు చెప్పి, డబ్బులు తీసుకుని పనులు గంటల్లో పూర్తి చేసి ఇస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ మరియు నాన్-ట్రాన్స్పోర్ట్ అనుమతులు వంటి ప్రతి సేవకు ఫిక్స్ రేట్లు పెట్టుకుని వసూళ్లు జరుగుతున్నాయంటున్నారు.
నేరుగా వెళ్తే పనులు కావు…దళారులతో వెళ్తేనే పనులు స్పీడు
కొంతమంది వాహనదారుల ప్రకారం, “నేరుగా వెళ్తే ఫైల్ ఎక్కడో ఆగిపోతుంది. అదే దళారి ద్వారా వెళ్తే అదే ఫైల్ ఒక్కసారిగా ముందుకు కదిలి, పనులు వేగంగా పూర్తవుతాయి” అని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితి వల్ల సాధారణ ప్రజలు తప్పనిసరిగా దళారులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఆర్టీవో కార్యాలయం లోపలే దళారీ వ్యవస్థ
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ దళారీ వ్యవస్థ మొత్తం ఆర్టీవో కార్యాలయం ఆవరణలోనే బహిరంగంగా నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయం లోపలే మధ్యవర్తులు తిరుగుతూ, వాహనదారులతో మాట్లాడటం, డీలింగ్స్ జరపడం, డబ్బులు తీసుకోవడం వంటి చర్యలు ఎవరికి కనిపించకుండా జరుగడం లేదని, అందరికీ తెలిసిన విషయంగానే కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం అసలు ఉద్దేశ్యం ప్రజలకు అవినీతి రహితంగా, వేగవంతంగా సేవలు అందించడం. కానీ మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. డిజిటల్ సేవల పేరుతో వ్యవస్థను మరింత క్లిష్టంగా మార్చి, దళారుల అవసరాన్ని పెంచేలా మారిందని వారు విమర్శిస్తున్నారు.
దళారీ వ్యవస్థతో వాహనదారులకు అదనపు భారం
దీంతో సాధారణ ప్రజలు అదనపు ఆర్థిక భారం భరించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఫీజులతో పాటు దళారుల కమిషన్ కూడా చెల్లించాల్సి రావడం వల్ల ఒక్కో పనికి వేల రూపాయల వరకు అదనపు ఖర్చు అవుతోందని బాధితులు చెబుతున్నారు. ఇది నేరుగా ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్ ఆర్టీవో కార్యాలయం పై ఏసీబీ,విజిలెన్స్ అధికారులు నిఘా పెంచాలి
ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో జరుగుతున్న దళారీ వ్యవస్థపై ఏసిబి అధికారులు, విజిలెన్స్ అధికారులు మేడ్చల్ ఆర్టీవో కార్యాలయం పైన నిఘా పెట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయంలో పూర్తిస్థాయి పారదర్శకత తీసుకువచ్చి, నిజమైన ఆన్లైన్ సేవలు అమలు చేయాలని, దళారుల ప్రభావాన్ని పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. లేకపోతే “ప్రజల సేవ కోసం” ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు “దళారుల ఆదాయ కేంద్రాలు”గా మారిపోతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

