ఒకే వర్గానికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు:కాడిగల్ల ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
శంకర్పల్లి, మే 14(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఆరోపించారు. ఒకే వర్గానికి ఇళ్లను కేటాయించడం చట్టవిరుద్ధమని, ఇప్పటివరకు చేసిన కేటాయింపులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సమానంగా అండాల్సి ఉండగా, ప్రత్యేకంగా ఒక కాంగ్రెస్ పార్టీ వర్గానికే ఇళ్లు కేటాయించడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. ఈ వ్యవహారంతో పట్టణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. స్థలం లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరారు. ఇప్పటికే ఇచ్చిన కేటాయింపులను రద్దు చేసి అర్హుల జాబితాను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

