ప్రజాక్షేత్రం కథనంతో కదిలిన అధికారులు… ఎక్స్రే సేవలు పునరుద్ధరణ
స్కానింగ్ ప్రింట్ సమస్యపై గర్భిణీల ఆవేదన
ఎక్స్రే సరి… స్కానింగ్ ప్రింట్ లేదు
కుషాయిగూడ,మార్చి 9(ప్రజాక్షేత్రం):కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్రే యంత్రం పని చేయడం లేదని ఫిబ్రవరి 10న ప్రజా క్షేత్రంలో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. వెంటనే సాంకేతిక సిబ్బందిని పిలిపించి ఎక్స్రే యంత్రాన్ని మరమ్మతులు చేయించారు. ప్రస్తుతం ఎక్స్రే సేవలు మళ్లీ అందుబాటులోకి రావడంతో రోగులకు ఉపశమనం కలిగింది. స్థానికులు కూడా సమస్యను త్వరగా పరిష్కరించినందుకు అధికారులను అభినందిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో మరో సమస్య గర్భిణీ స్త్రీలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, స్కానింగ్ చేసిన తర్వాత బిడ్డ యొక్క ఫోటో లేదా వివరాలు ఉండే పేపర్ ప్రింట్ అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా స్కానింగ్ తర్వాత బిడ్డ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ ఆ సౌకర్యం లేకపోవడంతో గర్భిణీలు నిరాశ చెందుతున్నారు. కొంతమంది గర్భిణీలు ప్రైవేట్ స్కాన్ సెంటర్లకు వెళ్లి ప్రింట్లు తీసుకోవాల్సి వస్తోందని, దాంతో అదనపు ఖర్చు పడుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో స్కానింగ్ యంత్రానికి సంబంధించిన ప్రింటర్ లేదా పేపర్ సౌకర్యాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని గర్భిణీ స్త్రీలు, స్థానికులు కోరుతున్నారు. అధికారులు కూడా ఈ సమస్యను పరిశీలించి త్వరగా పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


