నాగారం డివిజన్లో నిర్మాణ నిబంధనలు గాలికి
జీ+2 అనుమతితో జీ+2+ఫెంట్ హౌజ్ నిర్మాణాలు …
నాగారం డివిజన్లో చెలరేగుతున్న అక్రమ కట్టడాలు
నాగారం, మార్చి 16(ప్రజాక్షేత్రం):మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్లోని నాగారం డివిజన్లో అనుమతులకు మించి నిర్మాణాలు విస్తరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీ+2 వరకు మాత్రమే అనుమతి తీసుకున్న కొందరు నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ గ్రౌండ్ ప్లస్ రెండ్ ఫ్లోర్లు ప్లస్ ఫెంట్ హౌజ్లతో భవనాలను నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే భవనాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. భవన నిర్మాణ సమయంలో పార్కింగ్ స్థలం, సెట్బ్యాక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా తలెత్తే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అలాగే అక్రమ నిర్మాణాల వల్ల కాలనీలలో రోడ్లు ఇరుకుగా మారి అత్యవసర సమయంలో అంబులెన్స్, ఫైర్ సిబ్బంది వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బిల్డర్లు అధికారులతో కుమ్మక్కై నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి నాగారం డివిజన్లో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్రంగా తనిఖీలు నిర్వహించి, అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టకపోతే సమస్య మరింత తీవ్రమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

