వీధిలో నిరుపయోగంగా నిలిచిన నీటి ట్యాంక్
-వేసవిలో మరింత తీవ్రంగా మారిన సమస్య
-పగిలిన గోడలతో నీటి నిల్వ అసాధ్యం
పెద్ద కొడప్గల్ మార్చి 21(ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ఏస్సీ బాలుల సంక్షేమ గురుకుల పాఠశాల రోడ్డు ఎదురుగా ఏర్పాటు చేసిన నీటి ట్యాంక్ ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఒకప్పుడు పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చిన ఈ ట్యాంక్, ఇప్పుడు పాడైపోయి నిర్లక్ష్యానికి గురైంది. ట్యాంక్ గోడలు పగిలిపోవడంతో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా ట్యాంక్ చుట్టూ మురికి, చెత్త పేరుకుపోవడంతో అక్కడి వాతావరణం అస్వచ్ఛంగా మారింది. దీనివల్ల దోమలు, క్రిమికీటకాలు పెరిగే ప్రమాదం ఉండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు ప్రతిరోజూ తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు చిన్నపిల్లలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో నీటి కొరత మరింత పెరిగి ప్రజల సమస్యలు అధికమవుతున్నాయి.
స్థానికుల ప్రకారం, ఈ నీటి ట్యాంక్ చాలా కాలంగా మరమ్మత్తులు లేకుండా అలాగే వదిలేయబడింది. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. కనీసం తాత్కాలికంగా అయినా నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ ట్యాంక్ ఇలానే నిరుపయోగంగా ఉండటం దురదృష్టకరమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. వెంటనే ట్యాంక్ను మరమ్మత్తు చేసి, శుభ్రపరిచి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని కూడా వారు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటే, గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

