బరితెగించిన ఇసుక మాఫీయా..!
– పోలీసు వాహనాన్ని ఢీ కొట్టిన అక్రమార్కులు
– పెట్రోలింగ్ విధుల్లో ఎస్ఐ, సిబ్బందిపై దూసుకెళ్లిన వైనం
– బషీరాబాద్ మండలంలో ఘటన
తాండూర్ మార్చి 24(ప్రజాక్షేత్రం):తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫీయా బరితెగింది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ, సిబ్బందిపై ట్రాక్టర్లతో దూసుకవచ్చి పోలీసు వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ ఎస్ఐ శ్రీశైలం యాదవ్, సిబ్బందితో కలిసి పెట్రొలింగ్ నిర్వహిస్తున్నారు. మండలంలోని కోర్విచేడ్ గేటు వద్ద బషీరాబాద్ వస్తుండగా దామర్చేడ్ సురేష్, నంద్యానాయక్ శ్రీనివాస్లకు చెందిన ట్రాక్టర్లు నవల్గా వైపు వెళుతూ కనిపించారు. పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో సురేష్, శ్రీనివాస్లు ట్రాక్టర్లతో పోలీసు వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో పోలీసు వాహనాన్ని బలమైన దెబ్బ తగిలింది. వెంటనే ఇసుక అక్రమార్కులు సురేష్, శ్రీనివాస్లు పరారయ్యారు. పోలీసులు నిందితుల నివాసాలకు వెళ్లి విచారింగా అచూకీ లభించలేదు. నిందితులను ఎలాగైనా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీశైలం యాదవ్ తెలిపారు. మరోవైపు మండలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫీయాపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోలీసు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కాళ్లపై నుంచి ట్రాక్టర్ ఎక్కించారని, తాజాగా పోలీసు వాహనాన్ని ఢీ కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

