కనకమామిడిలో అక్రమ మైనింగ్పై ప్రజావాణిలో ఫిర్యాదు
- నేషనల్ హైవే పేరుతో కొండలను కొల్లకొడుతున్న మైనింగ్ మాఫియా.
- వంద మీటర్ల లోతుకు తవ్వకాలపై గ్రామస్తుల తీవ్ర ఆందోళన.
- అనుమతుల మాట ఎత్తితే దొంగాట ఆడుతున్న మెగా మైనింగ్ మేనేజర్ రాజేందర్ రెడ్డి.
- అక్రమ మైనింగ్ పనులు వెంటనే నిలిపివేయకపోతే భారీ ఆందోళనలు చేస్తామంటున్న గ్రామస్తులు.
- కూలీ వ్యవసాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి హెచ్చరిక.
మొయినాబాద్ జూన్ 01(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ గ్రామస్తులు, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి సోమవారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఏఓ ప్రభుదాస్కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, నేషనల్ హైవే పనుల పేరుతో దొంగ చాటున గుట్టలను పూర్తిగా తవ్వి వంద మీటర్లకు పైగా లోతైన గుంతలు తీయడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపారు. పేదలకు ఇండ్ల పట్టాలు కేటాయించిన సర్వే నంబర్ 51/1లో సైతం కొండలను నేలమట్టం చేస్తూ మైనింగ్ కొనసాగుతోందని, అలాగే 510 కూడా గుట్టుచప్పుడుకాకుండా అర్ధరాత్రి వేళ ఘోరమైన మైనింగ్ పనులు చకచక జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయమై మెగా మైనింగ్ సంస్థ మేనేజర్ రాజేందర్ రెడ్డిని వివరణ కోరగా సరైన సమాధానం ఇవ్వకుండా, అనుమతులకు సంబంధించిన ఆధారాలు చూపకుండా దొంగాట ఆడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ వెంటనే పనులను నిలిపివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఏఓ ప్రభుదాస్ స్పందిస్తూ మొయినాబాద్ డిప్యూటీ తహసీల్దార్కు ఫోన్ చేసి, మైనింగ్ నిర్వహిస్తున్న మెగా సంస్థ వద్ద ఉన్న అనుమతులు, సంబంధిత పత్రాల పూర్తి వివరాలను వెంటనే అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ను వెంటనే నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తామని బాధితులు హెచ్చరించారు. మేం ఏ మాత్రం నేషనల్ హైవే రోడ్డు పనులకు వ్యతిరేకం కాదు, కానీ కనకమామిడిలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై సమగ్ర విచారణ జరిపి బాద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని వారు అధికారులను కోరారు.

