పద్మశ్రీ మొగిలయ్యకు గాయని మధు ప్రియ ఆర్థిక సాయం
వేములవాడ, జూన్ 09(ప్రజాక్షేత్రం):తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ఇటీవల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ విషయమై ఆయన మీడియా ద్వారా స్పందిస్తూ.. తన పరిస్థితిని వివరించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను లేదా ప్రముఖ జానపద గాయని మధు ప్రియను కలవాలని ఉందని విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలపై గాయని మధు ప్రియ వెంటనే స్పందించారు. మొగిలయ్యను తన నివాసానికి ఆహ్వానించి ఆయన ఆరోగ్య పరిస్థితి, కుటుంబ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన వంతు బాధ్యతగా ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మధు ప్రియ మాట్లాడుతూ.. కళాకారులు సమాజానికి సంస్కృతి, సంప్రదాయాలను అందించే ఆస్తులని, అలాంటి వారిని కష్టకాలంలో ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మొగిలయ్య ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ.. అవసరమైతే భవిష్యత్తులోనూ తన సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. కిన్నెర వంటి అరుదైన జానపద కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్యకు మధు ప్రియ అందించిన ఈ చేయూతపై కళా రంగం నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఒక కళాకారుడు కష్టాల్లో ఉన్నప్పుడు మరో కళాకారిణి అండగా నిలవడం మానవత్వానికి ప్రతీకగా నిలిచిందని పలువురు కొనియాడారు.

