డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఉద్రిక్తత..!
– యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఉన్న కార్ డ్రైవర్ రెచ్చిపోయాడు.
– డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఉన్న ఎస్ఐ మధుపై కారు దూసుకెళ్లింది.
– కారు బానెట్పై పడిపోయిన ఎస్ఐ మధును.
– సుమారు 400 మీటర్ల వరకు లాక్కెళ్లిన డ్రైవర్.
– ఈ ఘటనలో ఎస్ఐ మధుకు తీవ్ర గాయాలు.
– మాల్ గ్రామ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
యాచారం, జనవరి 25(ప్రజాక్షేత్రం):“తాగి వాహనాలు నడిపితే సహించేది లేదు” అంటూ పోలీసులు ఎన్ని హెచ్చరికలు ఇస్తున్నా.. కొందరు మందుబాబులు మాత్రం ఏమాత్రం భయం లేకుండా రెచ్చిపోతున్నారు. డ్రంకెన్ డ్రైవ్ను అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేపడుతుంటే.. మద్యం మత్తులో ఉన్న ఓ కారు డ్రైవర్ ఏకంగా విధుల్లో ఉన్న ఎస్ఐపైనే వాహనం దూసుకెళ్లిన ఘటన హైదరాబాద్ నగర శివారులోని యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా శనివారం రాత్రి ఎస్ఐ మధు ఓ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కారు ఆగకుండా వేగంగా ముందుకు దూసుకొచ్చింది. దీంతో ఎస్ఐ మధు ఒక్కసారిగా కారు బానెట్పై పడిపోయారు. అక్కడితో ఆగని డ్రైవర్.. ఎస్ఐ బానెట్పైనే ఉన్నా సుమారు 400 మీటర్ల వరకు కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎస్ఐ మధుకు తీవ్ర గాయాలు కాగా.. సమీపంలోని మాల్ గ్రామంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాగి వాహనం నడపడం వల్ల మీ ప్రాణాలతో పాటు.. ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని పోలీసులు మరోసారి హెచ్చరించారు.

