నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం..
- ఆ పర్యటన వాయిదా వేసుకోవాలన్న సజ్జనార్
హైదరాబాద్ జనవరి 24(ప్రజాక్షేత్రం):నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. నగర ప్రజలు నుమాయిష్ పర్యటనను ఈ రోజుకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన కారణంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని కోరారు. అగ్నిప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లోని వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారని ఆయన వివరించారు. ఫర్నిచర్ దుకాణంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దట్టమైన పొగలు వ్యాపించి ఉండటంతో రెస్క్యూ టీమ్ భవనంలోకి వెళ్లలేకపోతోందని ఆయన తెలిపారు.

