వనపర్తిలో పన్నుల వసూళ్లపై కఠిన చర్యలు…
- గడువు ముగిసేలోపు చెల్లించని వారికి నీటి కనెక్షన్లు నిలిపివేత.
- కమిషనర్ వెంకటేశ్వర్లు.
వనపర్తి, మార్చి 28(ప్రజాక్షేత్రం):వనపర్తి మున్సిపాలిటీలో ఆస్తి పన్నులు, నల్లా బిల్లుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రెండు సంవత్సరాలకు పైగా బకాయిలు ఉన్న గృహ యజమానులు, వాణిజ్య సముదాయాల యజమానులు ఈ నెల 31వ తేదీ లోపు తమ బకాయిలను తప్పనిసరిగా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. గడువులోగా చెల్లించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ “పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం పన్నుల వసూళ్లు అత్యంత కీలకం. పన్నులు చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత. మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా కొనసాగాలంటే బకాయిలు లేకుండా చెల్లింపులు జరగాలి” అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “రెండేళ్లకు పైగా బకాయిలు ఉన్న వారు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరు లోపు చెల్లించాలి. లేని పక్షంలో వారి గృహాలకు ఉన్న నల్లా (నీటి) కనెక్షన్లు నిలిపివేయడం జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన తక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోంది” అని హెచ్చరించారు. నివాస గృహ యజమానులతో పాటు వ్యాపార సముదాయాల యజమానులు కూడా పన్నుల చెల్లింపులో సహకరించాలని ఆయన కోరారు. పన్నులు చెల్లించని గృహాలు, దుకాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే ఆస్తులపై జప్తు చర్యలు కూడా చేపట్టబడతాయని పేర్కొన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి వంటి సేవల నిర్వహణకు నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లు, నల్లా బిల్లుల సిబ్బంది పాల్గొన్నారు.


