తెలంగాణలో త్వరలో జడ్పిటిసి, ఎంపీటీసీ, ఎన్నికలు!
హైదరాబాద్ ఏప్రిల్ 18(ప్రజాక్షేత్రం):తెలంగాణలో జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎన్నికలకు రంగం సిద్ధమైంది, ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది, దీంతో మరోసారి తెలం గాణలో ఎన్నికల నగరా మోగనుంది. గత డిసెంబర్ నెలలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి కాగా.. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నిక లు కూడా నిర్వహించారు. తాజాగా.. ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మండల, జిల్లా ప్రజాపరిషత్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా తయారీకి శుక్రవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం 2025 జూలై 10 నుండి 2026 ఫిబ్రవరి 5 వరకు సమీకరించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. నియోజకవర్గాల్లోని అద నపు ఓటర్లను గుర్తించి, వారిని సంబంధిత పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా వర్గీకరిం చాలని అధికారులు ఆదేశించారు. ఈ డేటాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాల్సి ఉంటుంది. డేటాలో ఏవైనా లోపాలు ఉంటే ఈ నెల 23 వ తేదీలోపు నివేదించాలని, ఆ తర్వాత ముసాయిదా జాబితాలను విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని ఎస్ఈసీ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

