మహిళ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు!
– లారీ ఢీకొట్టడంతో విషాదం.. బాన్సువాడ ఆసుపత్రికి తరలింపు..
మే18,పెద్ద కొడప్గల్ (ప్రజాక్షేత్రం):పెద్ద కొడప్గల్ మండలంలోని బేగంపూర్ ఎక్స్ రోడ్డుపై సోమవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిచ్కుంద మండలం పెద్ద దడ్ది గ్రామానికి చెందిన మస్తాన్, రేష్మ, మహిన్ ముగ్గురు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రేష్మ (40) అనే మహిళ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు మస్తాన్, మహిన్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

