ప్రజాక్షేత్రం కథనం ఎఫెక్ట్తో కదిలిన యంత్రాంగం..!
- మురుగు సమస్యకు తక్షణ పరిష్కారం
- ”ప్రజా పాలన” పోస్టర్లకే పరిమితమా? ..కథనంతో స్పందించిన అధికారులు
కుత్బుల్లాపూర్, జూన్ 05(ప్రజాక్షేత్రం):ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కేంద్రంగా ఉండాల్సిన బస్తీ దవాఖాన ముందే మురుగు నీరు పొంగిపొర్లుతున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. గాజులరామారం సర్కిల్ పరిధిలోని సూరారం డివిజన్ న్యూ శివాలయం నగర్లో నెలకొన్న ఈ దుస్థితిని “ప్రజా పాలన” పోస్టర్లకే పరిమితమా?” అనే శీర్షికతో ప్రజాక్షేత్రం దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న సమస్యను ప్రజాక్షేత్రం ప్రధానంగా ప్రచురించడంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు బస్తీ దవాఖాన ముందు పేరుకుపోయిన మురుగునీటిని తొలగించి, డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. దీంతో రోగులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందారు.
ప్రజా సమస్యలపై మీడియా నిరంతరం నిఘా పెట్టినప్పుడే అధికార యంత్రాంగం కదులుతుందనే అభిప్రాయం మరోసారి వ్యక్తమవుతోంది. సమస్యను పరిష్కరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్న ప్రజాక్షేత్రం పాత్రను స్థానికులు అభినందించారు.

