కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట
- ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శ.
బూర్గంపాడు, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన పోరుబాట కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు బోరెం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బోరెం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా మహిళలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం, వికలాంగులకు పెన్షన్ల పెంపు వంటి అంశాలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే బీఆర్ఎస్ పార్టీ పోరుబాట కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ధనుగూరి నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షులు నస్కూరి అరవింద స్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షులు పెంకె శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు అరవ దుర్గారావు, బర్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

