వార్డు ఒక్కటే.. అభ్యర్థుల పేర్లూ ఒక్కటే
శంకర్పల్లి ఎన్నికల్లో వింత పోరు!
శంకర్ పల్లి ఫిబ్రవరి 06(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పురపాలిక ఎన్నికల్లో ఒక అరుదైన, ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ఒకే పేరుతో, ఒకే వార్డు నుంచి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. రెండో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకరు, భారాస తరఫున మరొకరు పోటీ పడుతుండగా.. వీరిద్దరి పేర్లు ‘బీసోళ్ల సంధ్యారాణి’ కావడం విశేషం. వీరి భర్తలు వరుసకు అన్నదమ్ములు కావడం గమనార్హం. ఒకే పేరు, ఒకే ఇంటిపేరు ఉండటంతో ఓటర్లు తికమకపడే అవకాశం ఉందని భావించిన అభ్యర్థులు, పేర్ల కంటే పార్టీ గుర్తును చూసి ఓటు వేయాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న ఈ ఇద్దరు తోడికోడళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

