తల్లి శవం వద్ద రాత్రంతా మూడేళ్ల చిన్నారి రోధన
– షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య
– మృతురాలు రంగారెడ్డి గూడకు చెందిన పోతుల శోభారాణి
– నర్సింహులుతో శోభారాణికి వివాహేతర సంబంధం
షాద్ నగర్, మార్చి 22(ప్రజాక్షేత్రం):నమ్మిన భర్త కాలయముడయ్యాడు.. కట్టుకున్న భార్య అని చూడకుండా అతి దారుణంగా ప్రాణాలు తీశాడు. అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి, రాత్రంతా తల్లి శవం వద్దే రోదిస్తూ గడపడం స్థానికులను కన్నీరు పెట్టించింది. వివాహేతర సంబంధం ముసుగులో జరిగిన ఈ ఘాతుకం షాద్నగర్ పరిధిలోని రంగారెడ్డిగూడలో కలకలం రేపింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…రంగారెడ్డి జిల్లా రంగారెడ్డిగూడకు చెందిన శోభారాణి (30)కి, మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన రాజుతో పదేళ్ల క్రితం వివాహమైంది. పదేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో నర్సింహులు అనే వ్యక్తి ప్రవేశించడంతో గొడవలు మొదలయ్యాయి. శోభారాణికి నర్సింహులుతో ఏర్పడిన వివాహేతర సంబంధం కారణంగా దంపతుల మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయి. దీంతో నెల రోజుల క్రితం భర్తను వదిలి శోభారాణి పిల్లలతో సహా పుట్టింటికి వచ్చేసింది.
అర్ధరాత్రి దారుణం.
నర్సింహులు అనే వ్యక్తి శోభారాణిని పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో పట్టుబట్టడంతో ఆవేశానికి గురైన భర్త రాజు, ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. శనివారం రాత్రి అత్యంత దారుణంగా ఆమెను హత్య చేసి, రంగారెడ్డిగూడ – తంగడపల్లి రహదారిలోని పొదల్లో పడేశాడు.
కదిలించిన దృశ్యం.
తల్లి మరణించిందన్న విషయం కూడా తెలియని ఆ మూడేళ్ల చిన్నారి, రాత్రంతా ఆ మృతదేహం వద్దే కూర్చుని ఏడుస్తూ గడపడం అందరినీ కలచివేసింది. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లే రైతులు ఈ దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న షాద్నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం, ఎస్త్స్ సుశీల మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

