ప్లాట్లలో అక్రమ ప్రవేశం, ధ్వంసం… సర్పంచ్పై ఫిర్యాదు
శంకర్పల్లి, మార్చి 25(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి మండలం పరిధిలో ప్లాట్లలో అక్రమ ప్రవేశం చేసి ఆస్తి ధ్వంసం చేసిన ఘటనపై మోకిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. బాధితుడు వర్మ మధు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, మహరాజ్పేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 25లో ఉన్న ప్లాట్లు నంబర్లు 31, 32, 321 లను కొనుగోలు చేసి, వాటికి సరిహద్దు గుర్తింపుగా కడీలు ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ నెల 24వ తేదీ సాయంత్రం సుమారు 6:15 గంటల సమయంలో ఇరుకుంట తాండ గ్రామ సర్పంచ్ పి. లక్ష్మన్ నాయక్ తన కార్ నెంబర్ టిజి O7 ఎఎల్ 9944 అనుచరులతో కలిసి బాధితుడి ప్లాట్లలో అక్రమంగా జేసీబీ నెంబర్ టిజి 07 జెఎస్ 7550 తో ప్రవేశించి, ఏర్పాటు చేసిన కడీలను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా నేను సర్పంచ్ని, సర్పంచ్ సంఘానికే వైస్ ప్రెసిడెంట్ని అని తన పదవిని దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు, అసభ్య పదజాలంతో దూషించినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనలో ఆస్తి నష్టం కలగడంతో పాటు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని బాధితుడు వాపోయాడు. తన భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, సర్పంచ్ మరియు అతని అనుచరులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఈ ఫిర్యాదుపై మోకిల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.


