డ్యాన్స్ చేస్తూ చేయి తగిలిందని.. విద్యార్థి తల పగలగొట్టారు!
- మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.
మొయినాబాద్, ఏప్రిల్ 06(ప్రజాక్షేత్రం):కళాశాల సాంస్కృతిక వేడుకల్లో చిన్నపాటి తగువు చివరకు పెద్ద గొడవకు దారితీసింది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో చేయి తగిలిందనే సాకుతో ఓ విద్యార్థిపై నిందితులు రాయితో దాడి చేసి తల పగలగొట్టిన ఘటన మొయినాబాద్ పరిధిలో కలకలం రేపింది. హైదరాబాద్ అమీర్పేటకు చెందిన ఇరుగు వేణు (22) హిమాయత్నగర్లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో విద్యార్థి. ఈ నెల 4వ తేదీ సాయంత్రం కాలేజీలో నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్లో వేణు డ్యాన్స్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు అతని చేయి ప్రణయ్ అనే వ్యక్తికి తగిలింది. ఈ విషయమై మాట్లాడుకుందామని అందరూ కలిసి కాలేజీ బయటకు వచ్చారు.
రాయితో దాడి
రోడ్డుపై మాట్లాడుతుండగా ప్రణయ్ అతని స్నేహితులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. “నువ్వు కావాలనే చేయి తగిలించావు” అంటూ వేణుపై దాడికి దిగారు. పిడిగుద్దులు కురిపిస్తూనే, పక్కనే ఉన్న రాయితో వేణు తలపై బలంగా బాదారు. ఈ దాడిలో వేణు తలకు తీవ్ర రక్తగాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

