రూ.30 వేల లంచం తీసుకుంటూ మహిళా ఎస్సై రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్..!
హైదరాబాద్, మే 20(ప్రజాక్షేత్రం):సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడిలో మహిళా ఎస్సై లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ఓ కేసు విషయంలో నిందితులను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన మహిళా ఎస్సై నందిత, ఏసీబీ అధికారుల వలలో చిక్కింది. వివరాల్లోకి వెళితే.. కేసులో సహకారం అందిస్తూ ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు ఎస్సై నందిత బాధితుల నుంచి రూ.30 వేల లంచం కోరినట్లు సమాచారం. దీంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చు పన్నారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్ విజయ్తో కలిసి రూ.30 వేల నగదు స్వీకరిస్తుండగా మహిళా ఎస్సై నందితను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ను ఏసీబీ డీఎస్పీ చలసాని శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిసింది. ఘటన అనంతరం ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్లో సోదాలు చేపట్టారు. స్టేషన్లోని సిబ్బంది సెల్ఫోన్లు సైతం స్వాధీనం చేసుకుని పలు కీలక వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. లంచం వ్యవహారంలో మరెవరైనా పాత్ర ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. పోలీస్ స్టేషన్లోనే అవినీతి ఆరోపణలతో ఎస్సై పట్టుబడడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

