ప్రముఖ ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న కన్నుమూత
ఖమ్మం, జూలై 03(ప్రజాక్షేత్రం):విప్లవ గీతాలతో, ప్రజా చైతన్య ఆటపాటలతో ఐదు దశాబ్దాల పాటు పీడిత ప్రజల పక్షాన నిలిచిన ప్రముఖ ప్రజా గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అరుణోదయ నాగన్న (65) శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ స్ట్రోక్, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఐదు దశాబ్దాల ప్రస్థానం
ఖమ్మం జిల్లా రాజారాం గ్రామానికి చెందిన నాగన్న, కేవలం 15 ఏళ్ల వయసులోనే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా ప్రజా ఉద్యమాల్లోకి అడుగుపెట్టారు. నాటి నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల స్ఫూర్తితో గొంతుకై నిలిచారు. ‘చికాగో నగరాన చిందిన రక్తము’, ‘ఎల్లందు గడ్డ మీద’ వంటి వందలాది విప్లవ, కార్మిక గీతాల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో విప్లవ పోరాట స్ఫూర్తిని రగిల్చారు. ఆయన మరణవార్త తెలియగానే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా సంఘాల నాయకులు, విప్లవ కళాకారులు, కవులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నాగన్న మరణం ప్రజా ఉద్యమాలకు, సాంస్కృతిక రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

