వెయ్యి రోజుల పాలనలో పల్లెలు అతలాకుతలం
- ఆరు గ్యారెంటీలు గాలికొదిలేసి ప్రజలను మోసం చేస్తున్నారు
- మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి
చేవెళ్ల, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదని, కేవలం మోసపూరిత హామీలతో ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని కందవాడ, పల్గుట్ట గ్రామాల్లో నిర్వహించిన ఐదో రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్లోళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ…ప్రజల పక్షాన నిలబడి, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం మేము నిరంతరం కొట్లాడుతుంటే.. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో కళకళలాడిన పల్లెలు, కాంగ్రెస్ పాలనలో కనీస పారిశుధ్యం లేక, అభివృద్ధి పనులు పూర్తిగా పడకేసి అధ్వాన్నంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని, ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కి ఇప్పుడు ప్రజలను దగా చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాలను చూసైనా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

