📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeతెలంగాణగుండెపోటుతో తండ్రి మరణం.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

గుండెపోటుతో తండ్రి మరణం.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

📰 Generate e-Paper Clip

గుండెపోటుతో తండ్రి మరణం.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మార్చి 14(ప్రజాక్షేత్రం):మోత్కూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ తన భవిష్యత్తు కోసం తండ్రి కన్న కలలను నెరవేర్చేందుకు ఒక కుమారుడు పరీక్షా హాలుకు వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఈ విపత్తు ఎదురైనా.. కుమారుడు హర్షవర్ధన్ కన్నీళ్లను దిగమింగుకుని పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గుండాల మండలం వస్తకొండూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎల్లయ్యకు శుక్రవారం ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి హఠాన్మరణంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, శనివారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలను ఎలాగైనా రాయాలని కుటుంబ సభ్యులు, బంధువులు హర్షవర్ధన్‌ను ఓదార్చి పరీక్షా కేంద్రానికి పంపారు. హర్షవర్ధన్ చూపిన ధైర్యాన్ని చూసి ఉపాధ్యాయులు, స్థానికులు కంటతడిపెట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular