శంకర్పల్లిలో వర్ష బీభత్సం
- చెట్లు విరిగి కరెంటు సరఫరాకు అంతరాయం
శంకర్పల్లి, మే 19(ప్రజాక్షేత్రం):శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో మంగళవారం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దాదాపు రెండు గంటల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు కూడా తెగిపడి విద్యుత్ లైన్లపై పడటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. భారీ గాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్ష ప్రభావంతో రహదారులపై చెట్లు కూలిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది, వార్డు సభ్యులు వెంటనే ఘటనాస్థలాలకు చేరుకుని చెట్లు, పోస్టర్ల తొలగింపు పనులు చేపట్టారు. విద్యుత్ శాఖ సిబ్బంది దెబ్బతిన్న లైన్ల మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మొబైల్ ఫోన్లను అవసరమైనప్పుడే వినియోగించాలని, పవర్ బ్యాంకులను సిద్ధంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.



