పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సర్పంచ్ మద్యపాగ కృష్ణ
మొయినాబాద్, జూన్ 20(ప్రజాక్షేత్రం):పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అమ్డాపూర్ గ్రామ సర్పంచ్ మద్యపాగ కృష్ణ అన్నారు. గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శనివారం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మద్యపాగ కృష్ణ మాట్లాడుతూ.. అక్షరాభ్యాసం ప్రతి చిన్నారి విద్యా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని అన్నారు. పిల్లల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి పెంపొందేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. పిల్లలకు మంచి విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ నేర్పించాలని, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సరస్వతి, స్వర్ణలత, గ్రామ కార్యదర్శి కవితా రెడ్డి, ఉప సర్పంచ్ జితేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

