రహదారా మురికి కాలువనా కుబీర్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యపు పరాకాష్ట!
నిర్మల్ జిల్లా జూలై 24(ప్రజాక్షేత్రం):కుబీర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారి చెరువును తలపిస్తున్నా. అధికారులు కళ్లున్నా కబోదుల్లా వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మురుగునీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది.రహదారిపై మురుగు కాలువలుప్రధాన కూడలి గుంతలమయమై, బురద నీటితో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. పాదచారులు కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. మురుగునీరు రోడ్డుపై నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై నిరసన జ్వాలలుసమస్య తీవ్రతపై స్థానికులు, వాహనదారులు పలుమార్లు పంచాయతీ, ఆర్&బీ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారులు తూతూమంత్రంగా పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని జనం మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

